కోల్కతా, ఏప్రిల్ 20 : టీమిండియా క్రికెటర్ మొహ్మద్ షమీ తన భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పాడు. గత నెల షమిపై సంచనల ఆరోపణలు చేసిన హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరోసారి షమిపై గృహ హింస కింద కేసు పెట్టింది. దీనిపై రెండు రోజుల క్రితం షమి విచారణకు హాజరయ్యాడు. తాజాగా ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. "షమి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేశాం. తనపై హసీన్ చేసిన ఆరోపణలన్ని అబద్ధాలని షమి చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరగొచ్చిన తర్వాత షమి దుబాయ్ వెళ్లిన దానిపై కూడా ప్రశ్నించాం. పాకిస్థాన్ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఆలోచిస్తున్నాం. షమి పాస్పోర్టును మేము సీజ్ చేయలేదు. అతను ఐపీఎల్ ఆడేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తాం"అని వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలతో సంబంధాలు, తనను చంపేందుకు ప్రయత్నించాడంటూ షమితో పాటు అతని కుటుంబసభ్యులపై హసీన్ జహాన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షమి ఐపీఎల్లో దిల్లీ డేర్డెవిల్స్ తరుపున ఆడుతున్నాడు.