గురువారం నుంచి ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు(తొలి డే/నైట్) మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 22 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డే/నైట్ రూపంలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. డే/నైట్ టెస్టుకి ఈరోజు నుంచే ప్రాక్టీస్ మొదలెట్టాలని టీమిండియా నిర్ణయించుకుంది. ఇండోర్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుగులో ఈరోజు రాత్రి కాసేపు పింక్ బాల్తో ప్రాక్టీస్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీసీఏని భారత క్రికెటర్లు కోరారు. దీంతో.. స్టేడియం క్యూరేటర్ సుమందర్ సింగ్ చౌహాన్ ఆ మేరకు పిచ్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ భారత జట్టు ఒక్కసారి కూడా డే/నైట్ టెస్టులు ఆడలేదు. దీంతో.. ఒరిజినల్ మ్యాచ్లో పింక్ బాల్లో ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున తగినంత ప్రాక్టీస్ చేయించాలని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా.. ఫ్లడ్ లైట్ల వెలుగులో పింక్ బాల్తో క్రికెటర్లు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఇన్నాళ్లు టెస్టుల్లో రెడ్ బాల్తో భారత ఆటగాళ్లు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్లో గత నాలుగేళ్లుగా డే/నైట్ టెస్టులు జరుగుతున్నాయి. కానీ.. భారత క్రికెటర్లు మాత్రం పింక్ బాల్తో ఆడటం తమకి అనుభవం లేదంటూ డే/నైట్ టెస్టుని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ తాజాగా భారత క్రికెటర్లని ఒప్పించడంతో సఫలమయ్యాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకూ డే/నైట్ టెస్టులు ఆడలేదు.