ముంబై, జనవరి 2 : ఐపీఎల్-11 కోసం ముంబై ఇండియన్స్ ఆ జట్టు సారథి రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు కృనాల్ పాండ్యను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2018లో ఆడే జట్లు తమ వద్ద అట్టి పెట్టుకునే ఆటగాళ్ల వివరాలు జనవరి 4 నాటికి అందజేయాల్సిందిగా ఐపీఎల్ నిర్వాహకులు ఫ్రాంఛైజీలకు సూచించారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాను, సన్రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ను అట్టిపెట్టుకోవాలని చూస్తోంది. దిల్లీ డేర్డెవల్స్ విషయానికొస్తే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ను అట్టిపెట్టుకోవాలని చూస్తోంది. గత రెండేళ్లు రైజింగ్ పుణె జెయింట్స్ తరఫున ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతుందని సమాచారం. ఐపీఎల్-11 సీజన్ వేలం ఈ నెల 27, 28న బెంగుళూరులో జరగనుంది.