మెహలీ, డిసెంబర్ 15: మైదానంలో ఉన్న ఆటగాడి కాళ్ళు పట్టుకుని ఆటోగ్రాఫ్ అడిగాడు ఓ అభిమాని. తన అభిమానాన్ని పాదాభివందనంతో చాటుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా... తన సారథ్యంలో భారత్ కు ఎన్నో ఘన విజయాలు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నా ఆయనికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పుకోవడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. ఇటీవల మెహలీ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో లంకేయులు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ అభిమాని ఒకరు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని కీపింగ్ చేస్తున్న ధోనీ వద్దకు వచ్చాడు. రాగానే అతనికి పాదాలకు నమస్కారం చేసి అతని వెంట తీసుకొచ్చిన పెన్ను, చిన్న అట్టపై ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ సమయంలోనే అప్రమత్తమైన సిబ్బంది అభిమాని వద్దకువచ్చి అతన్ని మైదానం నుంచి తీసుకువెళ్లారు. ఇలాంటి ఘటన ధోని కెరియర్ లో మొదటి సారి కాదు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది.