టైటిల్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్

SMTV Desk 2019-05-24 16:35:10  Title, Harmanpreet kaur,

జైపూర్: మహిళల ట్వంటీ20 ఛాలెంజ్‌కప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్‌నోవాస్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నోవాస్ 4 వికెట్ల తేడాతో మిథాలీరాజ్ జట్టు వెలాసిటీను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెలాసిటీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఒక దశలో 37 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వెలాసిటీను వికెట్ కీపర్ సుష్మ వర్మ, అమెలియా కేర్ ఆదుకున్నారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సుష్మ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరోవైపు సమన్వయంతో ఆడిన అమెలియా కేర్ 4 ఫోర్లతో 36 పరుగులు సాధించింది. దీంతో జట్టు స్కోరు 121కి చేరింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో లియా తహుహు, సోఫి డివైస్ పొదుపుగా బౌలింగ్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌నోవాస్ ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో నోవాస్ ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. వెలాసిటీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హర్మన్‌ప్రీత్ 37 బంతుల్లో 4ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 51 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. ఓపెనర్ ప్రియా పూనియా (29), జెమీమా రోడ్రిగ్స్ (22) తమవంతు సహకారం అందించారు. దీంతో సూపర్‌నోవాస్ ట్రోఫీని సొంతం చేసుకుంది.