ఈ ఐపీఎల్ సీజన్లో ఒంటి చేత్తో తమ జట్టుని గెలిపిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. ఈ సీజన్లో తన ఫామ్ గురించి స్పందిస్తూ 2017లో నేనే నిషేదం ఎదుర్కొన్న సమయంలో ఎంతో డిప్రెషన్కు గురయ్యాను. ఆ సమయంలో నాకు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఫోన్ చేశాడు. మనమంతా ఒకే కుటుంబం. నిన్ను మేము ఎప్పటికీ వదులుకోము అని అన్నాడు. దీంతో నా కళ్లు నీటితో నిండిపోయాయి. సాధారణంగా నేను ఏడవను. కానీ, వెంకీ నన్ను ప్రేమతో ఏడిపించాడు. ఈ సీజన్లో నా ప్రదర్శనకు ఒక రకంగా ఆయనే కారణం. కాబట్టి అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రె రస్సెల్పై స్వతంత్ర యాంటీ డోపింగ్ ట్రిబ్యునల్ సంవతర్సం నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2017 జనవరి 31 నుంచి అతనిపై సస్పెన్షన్ అమలు చేశారు. 2015లో రస్సెల్ మూడు సార్లు డోపింగ్ టెస్ట్కు హాజరు కాలేదు. అందుకు తగిన కారణాలను కూడా వివరించక పోవడంతో అతనిపై జమైకా డోపింగ్ నిరోధక కమిషన్ చార్జ్ నమోదు చేసింది. తర్వాత ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ అతణ్ణి విచారించి శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆ సీజన్కు రస్సెల్ స్థానాన్ని గ్రాండ్హోమ్తో భర్తీ చేసుకుంది కేకేఆర్ యాజమాన్యం.