హైదరాబాద్: శనివారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించగా ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సినిమా యూనిట్ ట్విటర్ వేదికగా పంచుకుంది. ఏప్రిల్ 24 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం #AA19Starts అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. గత జనవరిలో అర్జున్, త్రివిక్రమ్ తమ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్: కనబడుట లేదు’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ నటించనున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనున్నారు.