ముంబై : త్వరలో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ లో టీంఇండియా ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రపంచకప్ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని, అయితే దీని కోసం సమష్టిగా పోరాడాల్సి ఉంటుందన్నారు. కాగా, ప్రపంచకప్లో నాలుగో స్థానంలో ఎవరిని దించాలనే దానిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆటగాళ్లకు నంబర్లు కేటాయించడంపై కపిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జట్టులో ఆటగాళ్లకు నంబర్లు కేటాయించడం ఏంటి. ఏ ఆటగాడైనా.. జట్టు పరిస్థితులను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనవసరంగా ఈ ఆలోచనతో జట్టు ఆయోమయానికి గురికావొద్దని సూచించారు. కానీ నంబర్ల గురించి మాట్లాడటం మంచిదికాదన్నారు. యువ క్రికెటర్ రిషభ్ పంత్ గురించి మాట్లాడుతూ.. పంత్ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందని, రాబోయే తరాల ఆటగాళ్లు ధోనీ స్థాయిలో ఆడేందుకు ప్రయత్నించాలని సూచించారు. ధోనీని అందుకునే సత్తా పంత్కు ఉందని కపిల్ జోస్యం చెప్పారు.