హైదరాబాద్, మార్చి 4: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొద్ది కాలానికే, తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంది సాయిపల్లవి. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తున్న ఈ హీరొయిన్ కు మంచి క్రేజ్ ఉంది. కథల్లో కొత్తదనం ఉంటేనే ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయిపల్లవి. అందువల్లే ఆమె ఖాతాలో వైవిధ్యభరితమైన సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, మహేశ్ బాబు 26వ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేశ్ తన 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చేస్తున్నాడు. ఇక తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడని సమాచారం. ఈ సినిమా కథను ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ను కూడా కలిసి లైన్ చెప్పేసి వస్తాడని అంటున్నారు. సంగీత దర్శకుడిగా దేవీశ్రీని ఖరారు చేసుకుంటున్నట్టు సమాచారం.