హైదరాబాద్, ఫిబ్రవరి 06: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ను విడుదల చేస్తున్నాడు. మామూలుగానే సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు అందోలనలో ఉంటారు. ఇక బయోపిక్ లు, విభిన్న చిత్రాల విషయానికొస్తే దర్శకులు కూడా కాస్త టెన్షన్ లో ఉంటారు. అయితే యాత్ర దర్శకుడు మహి వి రాఘవ చాలా అప్రమత్తంగా ఉంటున్నాడు. అసలే రాజకీయాలు వేడెక్కుతున్న సమయం. అటు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇటు వైఎస్ తనయుడు జగన్ స్థాపించిన వైసిపి మధ్య పోరు గట్టిగా సాగుతోంది. ఈ సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ క్లిక్ అవ్వకపోవడం నెగిటివ్ కామెంట్స్ గట్టిగా రావడంతో ఆ దర్శకుడికి ఎఫెక్ట్ గట్టిగానే పడింది. అయితే ఈ సినిమాను రాజకీయ కోణంలో విభేదించి చూడవద్దని దర్శకుడు మహి ఒక లేఖను విడుదల చేశాడు.
శుక్రవారం సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే యాత్ర సినిమాను మరో సినిమాతో పోల్చకండి అంటున్నాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్ గారు గర్వించదగ్గ నాయకులంటూ ఎంతో కీర్తిని వదిలివెళ్లిన మట్టి వారసులని పేర్కొన్నారు. ముఖ్యంగా అభిప్రాయ బేధాలతో వారి గౌరవానికి భంగం కలిగించవద్దని విమర్శకులకు చెప్పకనే చెప్పారు. చిరంజీవి వైఎస్సార్ అంటే తనకు చాలా ఇష్టమని అంత మాత్రానా ఇతరుల మీద ద్వేషం రాదని దర్శకుడు మహి వి రాఘవ వివరణ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.