బెంగళూరు, మే 1 : ఐపీఎల్ లో కింగ్స్ X1 పంజాబ్ జట్టు కు రాసి పెట్టి ఉందని అంటున్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్నిఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలుచేయకపోవడంతో.. అభిమానులు చాలా ఆందోళన చెందారు. చివరిలో పంజాబ్ జట్టు రూ. 2 కోట్ల కనీస ధరకు అతన్ని దక్కించుకొంది. ఐపీఎల్లో ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు క్రిస్ గేల్. అలాంటి తనను బెంగళూరు అట్టిపెట్టుకోకపోవడం నిరాశకు గురి చేసిందని గేల్ చెప్పాడు. "నేను ఆ జట్టులో కీలక ఆటగాడిని. వారి తీరు నన్ను నిరాశకు గురి చేసింది. ఎందుకంటే వాళ్లు నాకు ఫోన్ చేశారు. తమ జట్టులో కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పారు. అట్టిపెట్టుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేనిక అవసరం లేదనే భావనను వాళ్లు కలగించారు. సరే కానివ్వండి అనుకున్నా. నేను ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడను" అని గేల్ చెప్పాడు. ఈసారి వేలంలో ముందు తనను ఏ ఫ్రాంఛైజీ తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచిందని గేల్ తెలిపాడు. ‘‘ఐపీఎల్ కంటే ముందు కరీబియన్, బంగ్లాదేశ్ లీగ్ల్లో బాగా ఆడాను. వేలంలో నా పట్ల ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంపై ఆశ్చర్యపోయా. ఐతే ప్రస్తుతం పంజాబ్ తరఫున ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. నేను కింగ్. కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడాలని రాసి పెట్టి ఉంది"అని గేల్ వ్యాఖ్యానించాడు.