బెంగళూరు, ఏప్రిల్ 25: టీమిండియా క్రికెట్ జట్టులో ధోని, కోహ్లి ఈ రెండు పేర్లు ఎంత పాపులరో వేరే చెప్పకర్లేదు. కానీ వీరిద్దరూ ప్రత్యర్దులుగా బరిలోకి దిగే అవకాశం మనకు కేవలం ఐపీఎల్ ద్వారానే దక్కుతుంది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పటిష్టమైన జట్టులు. ఐపీఎల్లో చెన్నైకు ధోని, బెంగుళూరుకు కోహ్లి నాయకత్వం వహిస్తున్నారు. లీగ్ లో భాగంగా ఈ రోజు వీరిద్దరూ నాయకత్వం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా జరుగుతోన్న కొన్ని మ్యాచ్లకు ప్రేక్షకాదరణ కరువైంది. కొన్ని స్టాండ్లు ఖాళీగా ఉండటం మనం టీవీల్లో చూశాం. కానీ, ఈ రోజు కోహ్లీ-ధోనీ తలపడే మ్యాచ్కి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం నలభై వేలు. మైదానం వద్ద ఆదివారం సుమారు 25వేల టిక్కెట్ల అమ్మకాలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు రూ.35వేలు, రూ.20వేల విలువ గల టిక్కెట్లు కూడా అందుబాటులో లేవని చెప్పేశారు.