శ్రీనగర్, ఏప్రిల్ 1: జమ్ముకాశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 8 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు.... ఇవాళ ఉదయం నుంచి దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్, షోపియన్ జిల్లాలను జల్లెడ పడుతున్నాయి.. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, మరొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు.