హైదరాబాద్, మార్చి 19 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కోల్కతాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితమే అక్కడకు చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్టులో సీఎం కేసీఆర్కు.. ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్టు నుండి నేరుగా ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్కు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమై.. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చించనున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని.. నేటి రాత్రి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.