న్యూఢిల్లీ, మార్చి 5 : పార్లమెంట్ సమావేశాల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన ఆరంభం నుండే సభ్యులు అడ్డుకోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనా పలువురు ఎంపీలు రాజ్యసభలో ఆందోళనలు కొనసాగించారు. దీంతో ఆగ్రహానికి గురైన చైర్మన్.. "మనం పార్లమెంట్ లోనే ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా?" అంటూ సభ్యులను మందలించారు. సభలో మన వ్యవహార శైలిని చూస్తూ దేశమంతా వేలెత్తి చూపుతుంది. సభ్యులు సంయమనంగా వ్యవహరించాలన్నారు. అయినప్పటికీ ఆ వాదనలను పట్టించుకోని తెదేపా ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళనలను కొనసాగించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.