న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : రాజ్యసభలో ఈ ఏడాదిలో సుమారు 59 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం ముగియనుంది. ఈ సారి పెద్దల సభలో అధికార బీజేపీ తమ స్థానాలను పెంచుకొని బలంగా మారాలని యోచిస్తుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రాలసభలో తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని చూస్తుంది (రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అని కూడా పేర్కొంటారు). వీరిలో 17 మంది ఎంపీలు ఉండగా, 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా మిగతా వారిలో నటి రేఖ, సచిన్ టెండూల్కర్ లాంటి సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వీరిలో 8 మంది కేంద్ర మంత్రులు కూడా ఉండటం విశేషం. కేంద్ర మంత్రులు జైట్లీ, జేడీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆ లెక్కన్న వీరు తిరిగి నామినేట్ కావటం ఖరారైపోయినట్లే. ఇక టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కూడా తిరిగి ఎన్నికయ్యే పరిస్థితులే కనిపిస్తుండగా.. దేవేందర్ గౌడ్ విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు చిరంజీవి, రేణుకా చౌదరి, ఆనంద్ భాస్కర్లు రీ నామినేట్ కావటం ప్రస్తుత పరిస్థితిలో కష్టమనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ హయాంలోనే నామినేట్ అయిన సచిన్, రేఖల పరిస్థితి కూడా అంతే. వీరిద్దరు సభకు హాజరు అయ్యే విషయంలో ఫిర్యాదులు కూడా ఉన్నాయి.