న్యూ డిల్లీ, జనవరి 11: సివిల్స్-2017 మెయిన్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, తదితర కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి ఉద్యోగుల ఎంపిక కోసం గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని యూపీఎస్సీ సూచించింది. ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది వరకు ఉత్తీర్ణులయినట్లు అంచనా. సుమారు వెయ్యి ఉద్యోగాలకు 2,565 మంది ముఖాముఖికి ఎంపికయ్యారు. ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసినప్పటికీ వారిలో సుమారు 6లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13,366 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరిగిన ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణల నుంచి దాదాపు 900 మంది పరీక్ష రాశారు.