భోపాల్, జనవరి 10 : దేశవ్యాప్తంగా ఏ రైల్వే స్టేషన్ చూసినా, ఎక్కడ చూసినా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించడం మనం చూశాం. అందులో భాగంగానే పలు టికెట్ కౌంటర్లు, సమాచార కేంద్రాలు సహా అన్నింటిలో మహిళలకు అగ్రస్థానం కల్పించారు. అయితే మధ్యప్రదేశ్ లోని భోపాల్ రైల్వే జంక్షన్ ఒకడు ముందుకేసి మహిళల అవసరాలను తీర్చే సదుపాయమూ కల్పించింది. రుతుక్రమం వచ్చే మహిళలు, యువతులను దృష్టిలో ఉంచుకుని కేవలం రూ.5కే రెండు శానిటరీ నాప్కిన్స్ను అందించేందుకు వెండింగ్ మెషిన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి "హ్యాపీ నారి" అని పేరు పెట్టారు. ప్రారంభించిన మొదటి రోజు నుండే విశేష స్పందన లభించడం విశేషం. ఇంతకీ ఈ మెషిన్ ఏర్పాటు, నిర్వహణ కోసం అయిన పూర్తి ఖర్చు ఎంతో అని ఆలోచిస్తున్నారా.? కేవలం రూ.20 వేలు మాత్రమే. ఈ విషయంపై భోపాల్ రైల్వే డివిజన్ మేనేజర్ (డీఆర్ఎం) శోభన్ చౌదరి మాట్లాడుతూ.. "మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు దిగువ మధ్య తరగతి వారికి అందుబాటు ధరలలో నాప్కిన్స్ అందజేయడమే ముఖ్య ఉద్దేశం" అన్నారు.