హైదరాబాద్, డిసెంబర్ 28 : ఈ ఏడాదిలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన "నిన్ను కోరి", "నేను లోకల్", "ఎంసిఎ" సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇటీవల విడుదలైన "ఎంసిఎ" చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి నటించింది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్న "కృష్ణార్జున యుద్ధం" చిత్రీకరణలో నాని నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2018 ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఈరోజు ట్విటర్ ద్వారా ప్రకటించింది.