దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని యూత్ స్టార్ విజయ్ దేవరకొండ బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు. ఈ మధ్య యంగ్ హీరోలు సొంత బ్యానర్లు స్థాపించి నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారు. ఆ కోవలోకి అర్జున్ రెడ్డి కూడా వెళ్తున్నాడా అంటే వెళ్తున్నాడనే చెప్పొచ్చు. మహేశ్ బాబు, సుధీర్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్లు ఇది వరకే తమ సొంత ప్రొడక్షన్ హౌజ్లు స్థాపించారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘ది కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థని స్థాపించాడు. అక్టోబర్ 5న నోటా చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా పబ్లిక్ మీట్ ఏర్పాటు చేశాడు విజయ్. ఇదే మంచి ముహూర్తంగా భావించినట్టున్నాడు విజయ్. ఈ కార్యక్రమంలోనే ప్రొడక్షన్ హౌజ్ లోగో విడుదల చేశాడు. ఈ బ్యానర్పై తాను నిర్మాతగా వరుస సినిమాలు నిర్మిస్తానని చెప్పాడు. మంచి టాలెంట్ వున్న దర్శకులను, నటీనటులను ఎంకరేజ్ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే ఈ బ్యానర్ను పెట్టినట్టు పేర్కొన్నాడు.