న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వివాహ విందు గురువారం ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. హోటల్ తాజ్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ఈ రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన దంపతుల డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ ఆలపించిన ఓ పాటకు కోహ్లీ-అనుష్క డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం, విరుష్క జోడీ డ్యాన్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. కాగా, ఈ నెల 26న ఈ జోడీ సినీ, క్రీడా ప్రముఖుల కోసం ముంబయిలో మరో వివాహ విందు ఏర్పాటు చేయనుంది. అనంతరం, జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రికాలో జరిగే తొలి టెస్టు కోసం డిసెంబర్ 27న కోహ్లీ సేన దక్షిణాఫ్రికా బయల్దేరనుంది. ఆయనతో పాటు భార్య అనుష్క కూడా వెళ్లనున్నారు.