న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : ప్రధాని మోదీ క్షమాపణ చెప్పవలసిందేనని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ.. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటున్నదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఆది నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలు కూడా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. "ఎవరూ క్షమాపణలు చెప్పలేరు. అయినా నిరసన తెలిపే పద్ధతి ఇది కాదు. మోదీ వ్యాఖ్యలు చేసింది సభలో కాదు కదా.." అన్నారు. ఈ విషయంపై ఎంపీ ఆజాద్ మాట్లాడుతూ.. "మోదీని గౌరవిస్తాం. ఒకవేళ ఆయనకు ధైర్యం ఉంటే ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలన్ని వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పలేక పోతే, కేవలం ఎన్నికల కోసం ఇలా చేశానని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి" అన్నారు. అనంతరం సభ నుండి కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేశారు.