హైదరాబాద్, డిసెంబర్ 19 : నగరంలోని సోమాజిగూడ లలితా జ్యుయెలరీ దుకాణంలో ఈ నెల 16న భారీ చోరి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరికి సంబంధి౦చిన నిందితులను పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. డీసీపీ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన షేక్ కరీముల్లా(27), వాణిక్రా౦తి ప్రేమికులు. ఉపాధి కోసం నగరానికి వచ్చి పారడైజ్ సింధి కాలనీలో చెరో హాస్టల్లో ఉంటున్నారు. వీరిద్దరూ ఇటీవల సోమాజిగూడలోని లలితా జ్యుయెలరీకి వెళ్లారు. అక్కడ అంతా రద్దీగా ఉండటంతో సిబ్బందిని మాటల్లో పెట్టి బంగారు గాజులు, బ్రాస్లెట్ చోరీ చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 65గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.