న్యూ డిల్లీ, డిసెంబర్ 16: దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాతో పాటు మరో ముగ్గురిని డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం దోషులుగా ప్రకటించింది. కాగా నేడు ఆ దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో మధు కోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్లు జైలుశిక్ష విధించింది. కోల్కతాకు చెందిన విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కంపెనీకి జార్ఖండ్లోని రాజారా నార్త్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని 2008లో కేసు నమోదు అయ్యింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయిన గుప్తా ఈ విషయంలో నిజాలను అప్పటి ప్రధాని, బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ వద్ద దాచిపెట్టారని సీబీఐ ఆరోపణలు చేసింది. కేటాయింపుల విషయంలో మధు కోడా, బసు, మరో ఇద్దరు అధికారులు విసుల్కి కేటాయింపులు జరగడంలో సాయపడ్డారు. ఈ కేసులో వారందరికీ సీబిఐ ప్రత్యేక కోర్టు శనివారం శిక్షలు ఖరారు చేసింది.