హైదరాబాద్, నవంబర్ 15 : టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య రగడ అధిష్టానం వరకు వెళ్ళింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయమేమిటంటే.. గత కొంతకాలంగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మనకేన౦టూ కొందరు ఎమ్మెల్సీలు క్యాడర్ ను డివైడ్ చేస్తున్నారని ఎమ్మెల్యేల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్సీల వ్యూహాత్మక రాజకీయాల విషయం కాస్త క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళింది. నిఘా నివేదికలతో పూర్తి విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు ఎమ్మెల్సీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయానికి ఎమ్మెల్సీలు సహకరి౦చకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.