హైదరాబాద్, అక్టోబర్ 10 : తరచూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని రహదారులు అధ్వానంగా మారడంతో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా నేత విమర్శించారు. జంట నగరాల్లోని ఏ ఒక్క రహదారి కూడా సరిగా లేదన్న ఆయన ఈ విషయంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రోడ్లపై గుంతల కారణంగా రోజు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఫ్లైఓవర్ పై గుంతలు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. నగర రహదారులను అద్దంలా మెరిపిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు మిన్నకుండిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.