ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యుడు నగేష్ ఇంటిలో మళ్లీ దొంగతనం జరిగింది. నగేష్ తన కుటుంబంతో సహా డిల్లీలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎంపి నివాసం ఉంటున్న ఇంటి తాళాలు పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు ఇరవై లక్షల రూపాయల విలువైన బంగారం, వెండితో పాటు 70 వేల నగదు కూడా అపహరించుకుపోయారు. ఎంపి నగేష్ ఇంట్లో దొంగతనం జరగడం ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే రెండు సార్లు ఇలా జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాత చోరులే మళ్లీ చోరి చేసి ఉంటారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నగేష్కు సమాచారం అందించగా ఆదిలాబాద్ కు బయలుదేరినట్లు తెలిసింది. దొంగలు ఇంటి వద్ద ఉన్న సిసి టీవీ పుటేజీని కూడా తీసుకుపోవడం గమనార్హం.