బెంగళూరు, సెప్టెంబర్ 25 : ప్రముఖ వ్యాపార సంస్థ “కేఫ్ కాఫీ డే” యజమాని వీజీ సిద్ధార్థ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.650కోట్ల వరకు ఉన్న అక్రమాస్తులను గుర్తించారు. గత వారంగా సిద్ధార్థకు చెందిన 25 ఆస్తులపై(బెంగళూరు, హసన్, చెన్నై, ముంబై) ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయనకు రహస్య ఆస్తులు రూ.650 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేఫ్ కాఫీడే సంస్థలకు యజమాని అయిన వీజీ సిద్ధార్థ.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణకు అల్లుడు కావడం గమనార్హం. ఈ ఐటీ అధికారులు జరిపిన సోదాలపై సిద్ధార్థ కుటుంబం నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడం విశేషం. త్వరలోనే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.