హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ఆరేళ్ల బాలుడిని బండరాళ్ళతో మోది అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ రెయిన్ బజార్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. రెయిన్ బజార్కు చెందిన అబ్బాస్ హసన్రజ్వీ కుమారుడు షబ్బీర్ను, అతని సమీప బంధువు జావేద్ అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా జ్యూస్ తాగడానికని చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడి నుండి ఆ బాలుడిని డబీర్పురలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బండరాయితో అతి దారుణంగా తలపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. కాగా తమ కుమారుడు రాత్ర౦తా ఇంటికి రాకపోయే సరికి భయపడిపోయిన షబ్బీర్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, జావేద్పై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో జావేద్ హత్య చేసినట్టు బయటపడగా... పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.