హైదరాబాద్, జూన్ 5 : వారసత్వ రాజకీయాలపై రాహుల్ గాంధీ మాట్లాడితే నవ్వొస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి లేదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తరతరాల వారసత్వమే తప్ప జవసత్వం లేదని ఆయన ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ఆహార అలవాట్లపై కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని, కొన్ని నియమనిబంధనలను మాత్రమే సవరించిందని చెప్పారు. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని పేర్కొన్నారు. ఎస్ సి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అందరిని కలుపుకొని రాష్ట్రపతి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ అందరినీ విడగొట్టుకుంటూ వెళ్తుంటే, బీజేపీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నదని వివరించారు. మీడియా సమావేశంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఎంఎల్ఎ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ అధికార ప్రతినిధి కుమార్ తదితరులు పాల్గొన్నారు.