హైదరాబాద్ సెప్టెంబర్ 8: టీచర్ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. దసరా కానుకగా వచ్చే నెల అక్టోబర్ లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు, వచ్చే ఏడాది ఆగష్టులోగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలంగాణ కొలువుల భర్తీ పై డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో అనేక విషయాలను వెల్లడించారు. అదేవిధంగా ఈ ఏడాది బీఈడి రాసిన అభ్యర్దులకు కూడా టీచర్ ఉద్యోగాలకు అవకాశాన్ని కల్పిస్తునట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై దృష్టి, ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతో పాటుగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కేజీ టూ పీజీ అనే కొత్త విద్యా విధానాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను తెలుసుకుని, అవి పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుందని దీనివలన ప్రజలలో విద్య వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుంది. నమ్మకాన్ని పెంచాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం విద్య వ్యవస్థలో అనేక మార్పులను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. విద్య వ్యవస్థలో సంస్కరణలకు పునాదులు వేసాం త్వరలో ఫలితాలు వస్తాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు వాటి ఇష్టానుసారం కళాశాలలు మంజూరు చేశాయని, వాటికి నిధులు, నియామకాలు.. లేకపోవడంతో నాణ్యమైన విద్య అందకుండా పోయిందని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి మరింత క్లిష్టంగా ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు.