వేములవాడ సెప్టెంబర్ 6: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆయనకు జర్మనీ పౌర సత్వం ఉందని హోం శాఖ సంయుక్త కార్యదర్శి నిర్ధారించారు. నిబంధనల ప్రకారం భారత దేశానికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఏడాది లోపే ఆయన పౌరసత్వం పొందినా తప్పుడు దృవీకరణ పత్రాలను సమర్పించారని 2009 లో ఆయనపై కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిన ఆది శ్రీనివాస్ ఆరోపించి కోర్టులో కేసు వేయడం జరిగింది. విచారించిన న్యాయస్థానం ఆయన పౌరసత్వం చెల్లదని 2013లో తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రమేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు స్టే మంజూరైంది. 2014 సాధారణ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్ మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. 2016 ఆగస్ట్ 11 న సుప్రీం కోర్టు ఆరే నెలల్లో తుది తీర్పు తీసుకోవాలని కేంద్ర హోం శాఖను ఆదేశించగా, హోం శాఖ ఆ గడువు సరిపోదని విన్నవించగా ఆ గడువును కాస్త పొడిగించింది. అయితే ఆ గడువు చివరి తేదీ మంగళవారం తో ముగియడంతో నిన్న ఈ తీర్పును వెల్లడించింది. కేంద్ర హోంశాఖ మొదటి దశ నిర్ణయంపై రివిజన్ పిటిషన్ వేసి తన హక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటానని రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.