మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 5: మధ్యప్రదేశ్లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 55 ఏళ్ల మహిళకు వారం రోజుల పాటు ఊరంతా భిక్షాటన చేయాలని, గ్రామపంచాయతీ శిక్ష విధించింది. అసలు విషయం ఏంటంటే..మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో మటాదిన్ గ్రామంలో కమ్లేశ్ అనే మహిళ ఆవు దగ్గర పాలు తాగుతున్న లేగదూడను తాడుతో గట్టిగా లాగింది. లేగ మెడకు తాడు బలంగా బిగుసుకుపోవడంతో అది గిలగిల కొట్టుకుని చనిపోయింది. దీనిపై స్థానిక గ్రామపంచాయతీ కమ్లేశ్ను వారం రోజుల పాటు ఊరి నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా, ఏడు రోజుల పాటు ఊర్లో భిక్షాటన చేయాలని ఆజ్ఞాపించింది. లేకపోతే జీవితకాలం పాటు ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాదు, భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో గంగానదికి వెళ్లి పాపప్రక్షాళన చేసుకోవాలని తీర్పు నిచ్చింది. ఇదిలా ఉండగా కమ్లేశ్ తనంతట తానే శిక్ష విధించాలని కోరినట్లు పంచాయతీ అధికారి శంభు శ్రీనివాస్ తెలిపారు.