ముంబై, సెప్టెంబర్ 1 : అధికార ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ పథకాలపై ప్రజలు విభిన్న రీతుల్లో స్పందించిన విషయం తెలిసిందే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒకే పన్ను- ఒకే దేశం (జీఎస్టీ) పథకంపై ముంబై వాసులు వినూత్న రీతుల్లో స్పందించారు. జీఎస్టీ పరిధిలోకి రాని 81 వస్తువుల్లో 10 వస్తువులతో ఉపయోగించి గణేశుడిని తయారు చేసి ప్రతిష్టించారు. ముంబైలోని ములుంద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గణేశ్ ఉత్సవ్ కమిటీ మండలి సభ్యులు ఇందుకోసం వీరు మట్టిపాత్రలు, ఉప్పు, పూజా సామాగ్రి, ఖాదీ దారం, పలక, గాజులు, సంగీత వాయిద్యాలు, చీపురుకట్ట, గాంధీ టోపీలను ఉపయోగించడం జరిగింది. `నిజానికి మేం స్వచ్ఛభారత్ ఇతివృత్తంగా గణేశుడిని తయారు చేద్దామనుకున్నాం. కానీ జీఎస్టీ గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న తరుణంలో ఈ జీరో జీఎస్టీ గణేశుడి ద్వారా జీఎస్టీ విధానంలో ఉన్న సదుపాయాలను తెలియజేయాలని ఇలా చేశామని మండలి సభ్యుడు దీపేశ్ యాదవ్ తెలిపారు. పూజలు పూర్తయ్యాక ఈ వినాయకుడిని నిమజ్జనం చేయకుండా, తయారీకి ఉపయోగించిన వస్తువులను పంచిపెడతామని దీపేశ్ తెలిపారు. కాగా, వినాయకుడి ఉదర భాగం కోసం వాడిన టాటా సాల్ట్ ప్యాకెట్లు జీఎస్టీ పరిధిలోకి వస్తుందన్న సందేహం వ్యక్త పరుచగా, `ఒక్క లోపం ఉందని భక్తిని కోల్పోకూడదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అవసరమైన వస్తువుల ధరలు పెరిగాయని భవిష్యత్తులో వచ్చే జీఎస్టీ లాభాలను ప్రజలు పట్టించుకోవడంలేదు. దీని గురించి ప్రచారణ చేయడానికే ఈ జీరో వినాయకుడిని రూపొందించమని మరోక సభ్యుడు కల్పేశ్ వెల్లడించారు.