న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : గత వారం రోజుల నుంచి చర్చనీయాంశమైన కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు ఎట్టకేలకు సమయం ఖరారైంది. ఈ నెల 3న (ఆదివారం) మంత్రి మండలి విస్తరణ చేపట్టనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ చైనా బయలుదేరనున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ఎన్డీయేలో కొత్తగా చేరిన మిత్రపక్షాలకు పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాపరూడీ, ఉమాభారతి గురువారం రాజీనామా సమర్పించారు. పలువురు మంత్రుల శాఖలు కూడా మార్చనున్నారు. ఇటీవల రైల్వేశాఖ మంత్రిగా రాజీనామా చేసిన సురేశ్ ప్రభుకు రక్షణ శాఖ పగ్గాలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. కాగా, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు బాధ్యతలు నిర్వర్తించిన పట్టణాభివృద్ధి శాఖ ఎవరికి కేటాయించే దానిపై ఇంకా ఏ స్పష్టత రాలేదు.