దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. తాజాగా ఉన్నావ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రమాదం వెనుక సదరు ఎమ్మెల్యే హస్తం ఉందని బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నయి. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన బహిష్కరణకు గురయ్యారు.
బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉన్నావ్ అత్యాచార ఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది. నిందితుడు సెంగార్, అతడి బంధువులు ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ నంబర్ ప్లేట్పై నలుపు రంగు పెయింట్ వేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరింది. ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్ కూడా దాఖలైంది.