2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఇద్దరు కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఏర్పడిన కమల్నాథ్ ప్రభుత్వం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో 29 లోక్సభ స్థానాలకు గాను కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఏప్రిల్ 20న బలం నిరూపించుకోవాలంటూ ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవ గవర్నర్కు లేఖ రాశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ నాయకులు అసెంబ్లీలో కమల్నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది.
దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లినట్టేనని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే విధిగా పెట్టుకున్నారు. రాష్ట్ర మంత్రులకు ఒక్కొక్కరికీ ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగించారు.
తమ తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా మంత్రుల పైనే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించగా, మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.