న్యూఢిల్లీ, ఆగస్ట్ 24 : వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన పదవికి రాజీనామా చేసారు. రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు సమర్ధవంతమైన సేవలను అందించడమే కాక రైల్వేలలో ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహిస్తూ ఎన్నో సరికొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో కూడా తనదైన ముద్ర వేశారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ, సురేష్ ప్రభు రాజీనామాను ఆమోదించి ఆయనను రక్షణ శాఖకు పంపనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ, విస్తరణ జరగనుండడంతో ఆ సమయంలో ఈ శాఖను భర్తీ చేయనున్నారు.