చెన్నై, ఆగస్ట్ 21: నేడు తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమైన విషయం సుపరిచితమే. దీనిపై ప్రముఖ నటుడు కమల్హాసన్ సోషల్ మీడియా వేదికగా మండి పడటమే కాకుండా ప్రభుత్వ పనితీరుపై స్పందించాల్సిందిగా తన అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. పార్టీలు విడిపోవడం, మళ్లీ కలవడం వంటి చర్యలతో తమిళ ప్రజలను ప్రభుత్వం వెర్రివాళ్లను చేస్తోందని ఆయన కామెంట్ చేశారు. తమిళ ప్రజల తలపై గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీలతో పాటు ఇప్పుడు జోకర్ టోపీ కూడా పెట్టారని ఆయన ఎద్దేవా చేస్తూ, తమిళంలో ట్వీట్ చేశారు. కాగా, కమల్ ఇటీవల కాలంలో తమిళ రాజకీయ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రముఖులను తరచూ నిలదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ తీరు పై తమిళ ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు సమాచారం.