కరీంనగర్: కరీంనగర్లో ల్యాండ్ మాఫియా రోజురోజుకి పెరుగుతూ పోతోంది. ముప్పై సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయి ఉన్న భూములను దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇదేంటి అని అడిగిన వారిని విచక్షణ రహితంగా కొడుతూ మహిళలను కాలితో తన్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. తన భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం ఏంటని ప్రశ్నించడానికి వెళ్లిన భూ యజమానిని విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టారు మాఫియా సభ్యులు. తన తండ్రిని కొడుతుండడం చూసి అడ్డుకోవడానికి వెళ్లిన యజమాని కూతురిని కూడా కాలుతో తన్నారు. ఈ మొత్తం సంఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.