బీహర్, ఆగస్ట్ 21: సెల్ఫీ ట్రెండ్ రోజురోజుకు ముదిరిపోతుంది. సమయం, సందర్భం లేకుండా బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇంత వరకు అత్యంత సాహసవంతమైన, ప్రాణాంతకమైన సెల్ఫీల గురించి తెలుసు. తాజాగా బీహర్ ప్రజాప్రతినిధి బాధ్యతను మరచి, విషాదకరమైన ఘటనా స్థలంలో ఉండి మరీ సెల్ఫీ దిగడం పెను దుమారం రేకెత్తిస్తుంది. బీహర్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు వరదల్లో చిక్కుకుని నానావస్తలు పడుతున్నారు. కాగా, అక్కడ ఏదో అరకొరకగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించగా, 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే సితామర్హి జిల్లాకి చెందిన అమిత్ కుమార్ అనే ఎమ్మెల్యే మరో నలుగురు భద్రతాధికారులతో కలిసి సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటుచేసిన పడవలో ఎక్కి సెల్ఫీ దిగారు. దీనిపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాలు... పర్యటక ప్రాంతాలుగా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.