వరంగల్: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వరంగల్ కలెక్టరేట్ విద్యార్థుల గురించి ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో నిరసనలు దిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కోసం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, కొండా సురేఖ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, కొండేటి శ్రీధర్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ బోర్డ్ అవకతవలకలపై సీఎం కేసీఆర్ ముందే సమీక్ష చేపడితే 19 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కేవనని విజయశాంతి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం చేజేతులా చిదిమేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డ్ అధికారులు తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని విజయశాంతి విమర్శించారు. దొరా.. 20 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా? ఇక నీ ఆటలు సాగవంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు అధైర్య పడవద్దని సూచించారు. ఇంటర్ విద్యార్ధుల కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు.