హైదరాబాద్: రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రాథమిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ కు తమ అభ్యర్ధన గురించి తెలియజేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జనసేన కార్యాలయంలో సమావేశమైన నేతలు, కార్యకర్తలు.. ఎన్నికల పై చర్చించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. స్థానిక సంస్థల్లో పోటీ చేసే అంశంపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీకి దిగుతున్నామని.. జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో అవసరమని స్పష్టం చేసిన వారు.. వాటిని గ్రామస్థాయిలో అమలు చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీచేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.