న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా పిఎం నరేంద్ర మోది . ఈ సినిమాను ఈసీ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా చూడకుండా దానిపై నిషేధం విధించడం సబబు కాదని తేల్చింది. ముందు కేంద్ర ఎన్నికల సంఘం సినిమాను చూడాల్సిందిగా ఆదేశించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మోదీ బయోపిక్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల చేస్తే.. ఓటర్లను ప్రభావితం చేస్తుందని.. ఈ సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ముందు సినిమా చూడాల్సిందిగా ఈసీని ఆదేశించింది. చూశాక.. అది ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తుందా.. ఓటర్లను ప్రభావితం చేస్తుందా లేదా అనే నిర్ణయించాలని చెప్పింది. మోదీ బయోపిక్ను పూర్తిగా చూసి ఏప్రిల్ 22లోగా తమ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి అందజేయాలని చెప్పింది.