న్యూఢిల్లీ, మార్చ్ 07: నేడు జరిగిన కేబినెట్ సమావేశాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 50 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షణ, హోం, రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొత్త విద్యాలయాలను ఏర్పాటు చేయాని నిర్ణయించారు. వీటిలో 50 వేల మంది విద్యార్థులను చేర్చుకుంటారు. 50 కేంద్రాల్లో రెండు ఆంధప్రదేశ్ కు దక్కగా, తెలంగాణకు మొండిచేయి చూపారు. ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడులో, ప్రకాశం జిల్లా కందుకూరులో కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త వాటిలో అత్యధికం ఉత్తర భారత రాష్ట్రాలకే దక్కాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితరాలకు నాలుగైదు చొప్పున కేటాయించారు.