హైదరాబాద్, ఫిబ్రవరి 12: కోస్టల్ బ్యాంకు చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డికి జయరాం కి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలపై బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డిని కూడా సోమవారం రాత్రి హైద్రాబాద్కు తీసుకొచ్చారు. వారిని విచారించటానికి పోలీసులకి నాంపల్లి కోర్టు మూడు రోజుల పాటు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు రాకేష్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. కాగా ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా రాకేష్ రెడ్డి చెబుతున్నందున ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. జయరామ్, రాకేష్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపనున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కొందరి నుండి సమాచారాన్ని సేకరించిన పోలీసులు, రాకేష్ నుండి కూడా సమాచారాన్ని సేకరించనున్నారు.