ఫిబ్రవరి 12: బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తెలంగాణాలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్, ప్రధాని నరేంద్ర మోదీ లను డిమండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ఉత్తుత్తి సర్వేలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికైనా స్వస్తిపలకాలి. చిత్తశుద్ధి ఉంటే తక్షణం కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి అని డిమాండ్ చేశారు. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం నుండి 36 గంటల పాటు దీక్ష నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం అంశాన్ని చేర్చి ఆరేళ్లు కావస్తున్నా కూడా నేటికీ అమలుకు కాకపోవడం దారుణమని అన్నారు. హరిప్రియ దీక్ష నేపథ్యంలో స్టీల్ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పట్టు ప్రజలకు తెలియజేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
హరిప్రియ చేపట్టనున్న ఈ దీక్ష బుధవారం మొదలై గురువారం ముగియనున్నది. ఈ దీక్ష ముగింపు సభకు పార్టీ అతిథులు హాజరుకానున్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీనటి విజయశాంతి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో సహా రాష్ట్ర స్థాయి నాయకులు మరికొందరు పాల్గొననున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.