హైదరాబాద్, జనవరి 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి జీవితాధారంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ . ఈ సినిమాను రెండు భాగాలుగా చేసి ఇప్పటికే మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయాకుడు సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ కాకపోయేసరికి ఈ చిత్ర బృందం అంతా మరో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బయోపిక్ రెండో భాగం మహానాయకుడు పై అంచనాలు పెంచడానికి చిత్రబృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కథలో కొత్త సీన్లను యాడ్ చేసింది. అంతేకాదు ప్రేక్షకులకు నచ్చే విధంగా మరో ట్రైలర్ ని కట్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎమోషనల్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో కూడా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికిప్పుడు సినిమా విడుదల చేస్తే కథానాయకుడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని భావిస్తోన్న యూనిట్ ఫిబ్రవరి 14 లేదా 15 వీలైతే మూడో వారంలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!