హైదరాబాద్, జూలై 31 : దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రం నిర్దేశించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా 58 రకాల సేవలను సత్వరమే అందించేందుకు విధివిధానాలు విడుదల చేసిన ప్రభుత్వం, వాటిని తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధృవీకరణకు అనుసంధానం చేసింది. కొత్తగా తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానంలో ఒక్క రోజులోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలో వృత్తి పన్ను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక శాఖలో భవన నిర్మాణ ప్రణాళిక ఆమోదానికి నిర్వహించే తనిఖీ నివేదిక, నమోదు పౌర సరఫరాల శాఖలో ఉత్పత్తిదారు, డీలర్ నమోదు కోసం నిర్వహించే తనిఖీ నివేదిక నమోదును రెండు రోజులో పూర్తి చేయాలని తీర్మానించింది. కార్మికశాఖలో కర్మాగారాల అనుమతి పునరుద్ధరణ సహకార సంఘాల రిజిస్ట్రేషన్ చట్టం కింద, సహకార సంఘాల నమోదు మూడు రోజుల్లో చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పారిశ్రామిక రాయితీలకు అక్నాలెడ్జ్ మెంట్ జారీ, కాలుష్య నియంత్రణ మండలిలో హరిత పరిశ్రమల పునరుద్ధరణ, విద్యుత్ కనెక్షన్ కోసం రోడ్డు తవ్వకాల అనుమతి, భవన నిర్మాణాల తనిఖీ నివేదిక నమోదును వారం రోజుల్లో చేయాలని స్పష్టం చేసింది. భవనాల స్వాధీన ధృవీకరణ పత్రం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ను ఎనిమిది రోజుల్లోగా జారీ చేయాలని పేర్కొంది. ఔషధాల ఉత్పత్తి అనుమతి పునరుద్ధరణ, టోకు లైసెన్సు జారీ, చిల్లర ఔషధ వ్యాపారులకు అనుమతులు జారీ, ఎలక్ట్రికల్ వ్యవస్థను 14 రోజుల్లో ఏర్పాటు చేయాలని విధి విధానాలను వెల్లడించింది. వ్యాపార అనుమతి, తూనికలు-కొలతల చట్టం కింద నమోదును ఆస్తుల మీటెశాన్ ను 15 రోజుల్లోను, బాయిలర్లు ఉత్పతిదారులకు అనుమతి, పునరుద్ధరణ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల పునరుద్ధరణను 21 రోజుల్లో చేయాలని నిర్ణయించింది. ఒప్పంద కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యం సంస్థ నమోదు అనుమతి జారీ, వలస కార్మికుల చట్టం కింద నమోదు దుకాణ, వాణిజ్య సంస్థల కింద నమోదు 30 రోజుల్లో చేయాలని తెలిపింది. ఈ సేవలన్నింటి కోసం ఆన్ లైన్ దరఖాస్తూ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది.