హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో రానున్న పంచాయతి ఎన్నికల్లో కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు ఎన్నికల సంఘం. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికి సిరా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా పెట్టారు. అయితే అది ఇంకా పూర్తిగా చెరగకపోవడంతో మధ్య వేలికి సిరా వేయాలని నిర్ణయిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. మూడు విడతలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 7, 11, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల రిటర్నింగ్ అధికారులు ఇచ్చే నోటీసులతో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన రోజునే ఫలితాలను వెల్లడించి, చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచి ఎన్నికలను సైతం పూర్తి చేస్తారు. నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. తెలంగాణలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా..
ఇప్పుడు 12,732 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.